- టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు
- అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్
టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కోకన్వీనర్ కే బాపురావు
కరీంనగర్/ధనాధన్ న్యూస్:
ఎన్టీవీ మీడియాలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనంపై ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ఓ ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఎన్టీవీలో వచ్చిన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్ లను బాధ్యులను చేస్తూ ‘సిట్’ పోలీసులు ముందస్తు
నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం దారుణమని ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్ కుడుతాడి బాపురావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే కథనాలకు ఆ సంస్థ ఎడిటర్, బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో పాటు సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని, కానీ ఆ సంస్థలో పని చేసే జర్నలిస్టులను, ఇతర ఉద్యోగులను బాధ్యులను చేసి అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
తమది ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…తన ప్రభుత్వంలోని అధికారులు అనుసరిస్తున్న విధానంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిజంలో మూడు దశాబ్ధాలుగా పని చేస్తున్న ఈ ముగ్గురు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయటం వెనుక కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందని, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే సదరు జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి పోరాటం చేశారని తెలిపారు. జర్నలిజం వృత్తిలో అనేక మంది జర్నలిస్టులు బహుజన వర్గాలకు చెందినవారని, సరైన వేతనాలు లేకపోయినా…వృత్తి పట్ల ఆసక్తితో యాజమాన్యాలు చెప్పినట్లు పని చేయాల్సివస్తుందని అన్నారు. బలహీనవర్గానికి చెందిన ఈ ముగ్గురు జర్నలిస్టులను సిట్ అధికారులు అరెస్టు చేయటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని బాపురావు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, సిట్ పర్యవేక్షణాధికారి సజ్జనార్ కు విజ్ఞప్తి చేశారు. బాధ్యులైన యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా అమాయక జర్నలిస్టులను అరెస్టు చేయడం సరైందికాదని, ఈ అక్రమ అరెస్టులు ఇతర జర్నలిస్టులను భయపెట్టేందుకు చేస్తున్న చర్యలని అన్నారు.
