
హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 29:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ (SIR) అంశంపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్ఐఆర్ సమన్వయకర్త, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేపడుతున్న విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్లలో పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా కొనసాగుతోందని, పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి, కౌన్సిలర్లు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, దేవస్థాన చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, బీసీ, ఎస్సీ, మైనారిటీ, సేవాదళ్ విభాగాల నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.