- విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నుల పంపిణీ

ఇల్లందకుంట,జూలై 10 (ధనాధన్ న్యూస్): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో శుక్రవారం ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు, బండి సంజయ్ కుమార్ వీరాభిమాని మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మట్ట పవన్ రెడ్డి మాట్లాడుతూ, “విద్యే సమాజ అభివృద్ధికి పునాది” అనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు, అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, బచ్చల భానుచందర్, అరవింద్ రెడ్డి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
