- ఫోన్ ట్యాపింగ్ సూత్రదారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులే,ఆధారాలతో సహా రుజువైంది
- కేసీఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర నాటకాలు
- హీరోల కంటే సోషల్ మీడియాలో కౌశిక్ రెడ్డి రీల్సే ఎక్కువ
- ప్రజా సంక్షేమమే,ప్రజా ప్రభుత్వ ధ్యేయం
- కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ బాబు
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కేసీఆర్,కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని,అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య,వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,గడిచిన 18 నెలల్లో నియోజకవర్గంలోని ఐదు పాఠశాలలకు కోటి 13 లక్షల నిధులు వెచ్చించామని,నీటి సమస్యకు కోటి రూపాయలు వెచ్చించామని అన్నారు.ఉప ఎన్నికల సమయంలో అడ్డగోలుగా ప్రొసీడింగులు ఇచ్చి తరువాత రెండేళ్లు విప్ గా,ఎమ్మెల్సీగా ఉండి కౌశిక్ రెడ్డి ఏం చేయలేక ఇప్పుడు ఆది కావాలి ఇది కావాలి అనడం విడ్డూరంగా ఉందని,నియోజకవర్గంలో కుల సంఘాలు,మహిళా భవనాలతో పాటు,ఆంజనేయస్వామి దేవాలయ ప్రహరీ,20 లక్షలతో కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు పనులు త్వరలో చేపడుతున్నామని అన్నారు.గతంలో ఇక్కడి నుండి నాయకత్వం వహించి ఉన్నత పదవులు అనుభవించిన వారు ఈ ప్రాంతంలో ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న పనులకు శ్రద్ధ చూపలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోక్షం కల్పిస్తున్నామని అన్నారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన ఎంజెపి పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని,ఆయా మండలాలలో సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు.డైట్,కాస్మటిక్ చార్జీలను పెంచామని,పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ 18 నెలలలో చేసి చూపించిందని,రేషన్ కార్డులు,సన్న బియ్యం,మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంలాంటివి తీసుకొచ్చిందని అన్నారు.
ఆరు గ్యారంటీలను ప్రతీ ఇంటికి చేరవేరుస్తున్నాం
ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందనీ,కళ్ళు ఉండి కూడా చూడలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉచిత బస్సు ద్వారా కోటి 30 లక్షల టిక్కెట్లు మహిళలకు ఇవ్వగా 52 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని,రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ కూడా చేశామని,తొమ్మిది రోజులలో 9000 కోట్లు రైతు భరోసా ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది అని,రైతులకు బోనస్ పూర్తిస్థాయిలో అందజేశామని ఈ సంవత్సరం కూడా అదే తరహాలో ఇస్తామని అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు నెలకు 5,6 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని,అయినా భారం అనుకోకుండా పనులు చేస్తున్నామని,కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు 4వేల రూపాయలు ఆదా ఆవుతోందని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ సూత్రదారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులే-ఫస్ట్ లుక్ కే ఉలిక్కిపడితే టీజర్ కి కౌశిక్ రెడ్డి పరిస్థితి ఏంటో
ముఖ్యమంత్రి ప్రైవేట్ హ్యాకర్లతో ఫోన్లు హ్యాకింగ్ చేయించామనడం సిగ్గుచేటని ప్రణవ్ మండిపడ్డారు.నిరాధార ఆరోపణలు చేసి అల్ప సంతోషం పొందే కౌశిక్ రెడ్డికి,ముఖ్యమంత్రి పై ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే బహిరంగంగానే గుణపాఠం చెప్తామని,ఫోన్ హ్యాకింగ్ దేశంలోనే మొట్టమొదటగా మొదలుపెట్టింది బిఆర్ఎస్ పార్టీ అని ఆది ఆధారాలతో సహా రుజువైందని గుర్తుచేశారు.కౌశిక్ రెడ్డి తన పెద్ద బాస్ చిన్న బాస్ ల మెప్పు పొందడానికి ఇదంతా చేస్తున్నాడని,ముఖ్యమంత్రిని తిట్టే స్థాయి కాదని,వెంట్రుకతో సమానమని,బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డిని ఏం చేయలేకపోయారని,రేవంత్ రెడ్డి దమ్మేంటో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే చూపించారని,అంతగా తెలుసుకోవాలి అనుకుంటే కేసిఆర్,కేటీఆర్ అడిగితే చెప్తారని అన్నారు.రేవంత్ రెడ్డి వల్ల ఒకరు ఫామ్ హౌజ్ కు పరిమితం కాగా మరొకరు దేశాలు తిరుగుతున్నారని,మొన్న ఎన్ఎస్యూఐ విద్యార్థులు చూపించింది ఫస్ట్ లుక్ మాత్రమేనని ఇంకా టీజర్,ట్రైలర్,సినిమా బాకీ ఉందని అన్నారు.కౌశిక్ రెడ్డి రీల్స్ లో మాత్రమే ఉంటారని రియాల్టీలోకి ఉండరని అన్నారు.
బీజేపీ,బీఆర్ఎస్ ములాఖాత్
బిజెపి ఎంపీ సిఎం రమేష్ బిఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తారని చెప్పడంతో కేటీఆర్ ఉలిక్కిపడుతున్నారనీ,అసలు బీజేపీ ఎంపీ ఇంటికి కేటీఆర్ ఎందుకు వెళ్ళాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తమ స్వంత లాభం కోసం పార్టీ విలీనానికి వెనకాడని కేటీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను ఏం కాపాడుతారని ప్రశ్నించారు.తెలంగాణ ఇచ్చిన,తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ను సర్వతాముఖోభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.
