
కాటారం,జూలై 29(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామంలోని అయ్యప్ప మహిళా గ్రూపు సభ్యులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం సామూహికంగా గోరింటాకు సంబురాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు గోరింటాకును సేకరించి ఒకరికి ఒకరు చేతులకు పెట్టుకుంటూ ఆటలు, పాటలు, నృత్యాలతో సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు ఆషాఢ మాస విశిష్టతను చాటుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం శుభప్రదమనే విశ్వాసం ఉందని, ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా భారతీయ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇటువంటి సామూహిక కార్యక్రమాలు మహిళల మధ్య పరస్పర ఆప్యాయత, ఐక్యతను పెంపొందిస్తాయని, ప్రతి సంవత్సరం ఈ వేడుకను నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
