- అభినందించిన ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో సుధాకర్ రావు
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వాస్పత్రి సేవలపై నమ్మకం కలిగించేందుకు రాంపూర్ గ్రామానికి చెందిన ముషం శ్రీనివాస్ తన భార్య ప్రత్యూషను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి డెవలరీ చేయించిన ఆలోచన గొప్పదని ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో సుధాకర్ రావు కొనియాడారు. కాగా ముషం శ్రీనివాస్ తనకు పాప జన్మించిన సందర్భంగా ప్రభుత్వాస్పత్రికి తన వంతు సాయం అందించాలనే సంకల్పంతో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని సుమారు 10వేల విలువ చేసే వోల్టాస్ వాటర్ డిస్పెన్సర్ ను ప్రభుత్వాస్పత్రికి అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ…ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, ఆర్ధిక స్థోమత లేని నిరుపేదలు దైర్యంగా ప్రభుత్వాస్పత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని సదుపాయాలతో పాటు అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. డెవలరీ వార్డులో వేడి నీటిని అందించేందుకు వాటర్ డిస్పెన్సర్ ను అందించినట్లు తెలిపారు. ఆర్ఎంవో సుధాకర్ రావు శ్రీనివాస్ మంచి ఆలోచనను అభినందిస్తూ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు ఉపయోగపడే మంచి పనులను చేసేందుకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ స్నేహితులు గోషికొండ రాజ్ కుమార్ , చేరాల రవితేజ తదితరులున్నారు.
