- పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుమారులు కిషన్ రావు,శ్రీనివాస్ రావు,మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు,కుటుంబ సభ్యులు
- ఈ ప్రాంత అభివృధ్ధి కోసం కృషి చేసిన వ్యక్తి రాజేశ్వర్ రావు
- సాగునీరు,త్రాగునీటి సరఫరా కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి
హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 93వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల రాజేశ్వర్ రావు విగ్రహానికి వారి కుమారులు కిషన్ రావు,శ్రీనివాస రావు,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు,కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.పేదల పక్షాన నిలబడి వారికి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాడని,గల్లి నుండి ఢిల్లీ వరకు అందరితో కలివిడిగా మెదిలి హుజురాబాద్ అభివృద్ధికి తనవంతు సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు.తాత ఆశయాలను కొనసాగిస్తూ,ప్రజలకు సేవ చేయడంలో ప్రణవ్ ముందు ఉంటున్నారని,రాబోయే కాలంలో హుజురాబాద్ ప్రజలకు ప్రణవ్ మరింత సేవ చేస్తారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మాట్లాడుతూ..
హుజురాబాద్ ప్రాంతానికి వొడితల(సింగాపురం) రాజేశ్వర్ రావు సేవలు మరువలేనివని,హుజురాబాద్ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావున ఇక్కడి రైతుల అవసరాలకు గుర్తించి అప్పుడే కాకతీయ కేనాల్ ఈ ప్రాంతానికి రావడానికి కృషీ చేశారని,వారి కృషి వల్ల ఈనాడు హుజురాబాద్ ప్రాంతం సస్యశ్యామలంగా ఉందని అన్నారు.తాగునీటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు మంచినీటిని ఇంటి ఇంటికి అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుమారు ఎనిమిది కోట్లు ఆనాడే మంజూరు చేయించి 33 గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం కృషి చేశారని అన్నారు.వారి అడుగు జాడల్లో నడుస్తూ వారి ఆశయాలను కుటుంబ సభ్యులుగా ముందుకు తీసుకుపోతమని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా నాయకులు,అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
