ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే మీ తోడుగా మేమిద్దరం ఉంటాం

By dhanadhannews.com

  • రాబోయే కాలానికి కాబోయే పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్
  • కాంగ్రెస్,బిజెపిలకు కేసీఆర్ భయం పట్టుకుంది
  • ఆరు గ్యారెంటీల అమలు పచ్చి అబద్ధం
  • ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడు రేవంత్ రెడ్డి
  • జమ్మికుంట రోడ్డు షో లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే06:తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మోసగాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఎవరికి అమలు చేశారో కూడా చెప్పాలన్నారు.మహిళలకు 2500 పెన్షన్, రైతులకు రుణమాఫీ,500 రూపాయల బోనస్ లాంటివి ఆరు గ్యారెంటీలలో లేవా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో పూర్తిస్థాయిలో ఒకటి కూడా అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లు ఆరు గ్యారెంటీల అమలు పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి వినోద్ కుమార్ ను గెలిపిస్తే పార్లమెంటులో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గెలిపించాలన్నారు.

సిరిసిల్ల కంటే హుజురాబాద్ నియోజకవర్గం లో పదివేల ఓట్ల మెజారిటీ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.హుజురాబాద్ నియోజకవర్గం 50 వేల మెజారిటీ పైచిలుకు వస్తుందని అన్నారు.వినోద్ కుమార్ ను గెలిపిస్తే ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.కాంగ్రెస్ బిజెపి పార్టీలకు బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయం పట్టుకుందని,అందుకనే కావాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రోడ్ షోలను అడ్డుకుంటున్నారని అన్నారు.కెసిఆర్ రోడ్ షో చేస్తే రెండు పార్టీలను 100 మీటర్ల లోపల తొక్కుతారని భయంతోనే ఆయనను రోడ్ షో చేయకుండా అడ్డుకున్నారని అన్నారు.తెలంగాణ వ్యాప్తంగా కెసిఆర్ రోడ్ షోకు అనూహ స్పందన వస్తుందని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీ ఆర్ఎస్ గెలవబోతుందని అన్నారు.రాబోయే కాలానికి కాబోయే పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్,ఎమ్మెల్సీ రమణ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు,ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెలు శ్రీనివాస్ యాదవ్ లతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.