కబ్జా భూమిపై ఆఫీసర్ల సర్వే

By dhanadhannews.com

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో ఉన్న సర్వే నం.467లో గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించిన ఘటనపై అధికారులు కదిలారు.శుక్రవారం జమ్మికుంట తహశీల్దారు జి.రమేష్ బాబు ఆధ్వర్యంలో డివిజన్ డీఐ ఫయాక్ అలీ జమ్మికుంట సర్వేయర్ మనోజ్‌తో పాటు పలువురు సిబ్బంది స్థలాన్ని సర్వే చేయడానికి వెళ్లారు.గత కొద్దిరోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న వార్తలతో పాటు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త గుర్రపు మహేందర్‌గౌడ్ తహశీల్దార్‌కు ఈ స్థలంపై ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో సర్వేకు అధికార యంత్రాంగం వచ్చింది.అధికారులు సర్వేకు ప్రయత్నం చేయగా కొంతమంది ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.దీనితో అధికారులు వారిపై సీరియస్ అయ్యారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని,ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు వారికి తెలిపారు.ఈ స్థలం విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న కొంతమంది వ్యక్తులు తహశీల్దారును కలిసి 10 రోజుల సమయం ఇవ్వాలని, స్థల యజమాని వస్తారని అడిగారు. దాంతో తహశీల్దారు వారికి పది రోజుల సమయం ఇచ్చారు. రెండు రోజుల్లో స్థల యజమానులకు నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు. అధికారులు ఓ వైపు స్థల విషయమై మాట్లాడుతుండగానే కొందరు వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై బూతుపురాణం మొదలుపెట్టారు. ప్రభుత్వ భూమి కబ్జాపై వరుస కథనాలు రాస్తున్న పాత్రికేయులను దూషించడం సరికాదని,వారిని తిట్టడం హేయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.